దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సరికొత్త యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సొంత బిడ్డల్లా భావించి, నూరు శాతం ఎన్రోల్మెంట్ సాధనపై అధికారులు, ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో దృష్టి సారించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన పబ్లిక్ స్కూల్ విద్యా విధానాన్ని తీసుకురావడానికి క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా విద్యాశాఖలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్యతో పాటు, విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
అమరావతి సచివాలయంలో మంత్రి నారా లోకేశ్ డీఈవోలు, ఈపీసీలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీలో అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ ప్రకటించారు. ఇందులో భాగంగానే మన ఉపాధ్యాయులను విదేశాలకు పంపి, అక్కడ అధ్యయనం చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తామని వెల్లడించారు. ఓపెన్ మార్కెట్తో పోటీపడేలా విద్యావ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. గతంలో విద్యాశాఖలో కనీస డేటా బేస్, విజిబిలిటీ లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఈ లోపాన్ని సవరిస్తూ, పక్కా సమాచారంతో కూడిన డ్యాష్ బోర్డును సిద్ధం చేశామని దీని ఆధారంగానే డీఈవోలు, ఏపీసీలు భవిష్యత్ కార్యాచరణను అమలు చేయాలని ఆదేశించారు. త్వరలోనే ఈ డ్యాష్ బోర్డు యాక్సెస్ను ప్రజలకు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.




Total views : 81753